తెలంగాణ కొత్త రేషన్ కార్డులు జారీ చేసింది 2025 జనవరి 26

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ప్రకటన స్థలం లేని పేదలకూ ఇంటి సదుపాయం హైదరాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ సాక్షి, సిటీబ్యూరో: ఈ నెల 26 నుంచి హైదరాబాద్‌లో కొత్త రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియæ ప్రారంభించనున్నట్లు జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. అదే రోజు నుంచి ఇందిరమ్మ ఇళ్లకు ఎంపికైన లబ్ధిదారుల వివరాలు కూడా వెల్లడిస్తామన్నారు. ఆదివారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలకతీతంగా, ఇతర జిల్లాలకు ఆదర్శంగా రాజధాని నగరంలో రేషన్‌ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. సొంత స్థలమున్న పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేందుకు ఎంతో ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. గతంలో ఉన్న నిబంధనలకనుగుణంగానే కొత్త రేషన్‌ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన 50 శాతం పూర్తయిందని, వాటిలో దాదాపు 10 వేల మంది అర్హులున్నట్లు తెలిపారు. ప్రభుత్వం పేదలకు అందజేస్తున్న సంక్షేమ పథకాలకు ‘ప్రజాపాలన’ సందర్భంగా దరఖాస్తులు ఇవ్వలేకపోయిన వారు ఇప్పుడు కూడా సంబంధిత కార్యాలయాల్లో ఇవ్వవచ్చని పొన్నం తెలిపారు. సమావేశంలో ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్, మేయర్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ప్రకాశ్‌గౌడ్, జాఫర్‌ హుస్సేన్, మీర్‌ జుల్ఫికర్‌ అలీ, మాజిద్‌ హుస్సేన్, రాజాసింగ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఇలంబర్తి, జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ తదితరులు పాల్గొన్నారు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించే క్రమంలో దరఖాస్తు చేస్తున్నవారి అర్హత విషయంలో ప్రభుత్వం కొన్ని సాంకేతిక సవరణలు చేయాలని మంత్రికి మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి సూచించారు. ఎల్లో కలర్‌ ప్లేట్‌ టాక్సీ డ్రైవర్లను కూడా కారు ఓనర్లుగా గుర్తించడం ద్వారా పేదలకు అన్యాయం జరుగుతోందన్నారు. వికలాంగుల జాబితాలో తలసేమియా బాధితులను, కీమో థెరపీ చేయించుకునే వారిని, డయాలసిస్‌ పేషెంట్లకు కూడా చేర్చాలని కోరారు. వీరికి ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డులు మంజూరు చేయాలన్నారు.

Comments